చేర్యాల, మార్చి 9: కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో శుక్రవారం అర్ధరాత్రి పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఒగ్గు పూజారులు పంచరంగులతో పెద్దపట్నం వేసి జానపద పాటలు పాడారు. లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటలకు మల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం దాటించారు. అనంతరం భక్తులు పట్నం దాటి స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన మల్లన్న భక్తులు కొమురవెల్లిలో మహారాష్ట్ర భవన్ నిర్మించుకునేందుకు శనివారం భూమిపూజ నిర్వహించారు.