హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-విజయవాడ రహదారి(ఎన్హెచ్-65)పై 17 బ్లాక్స్పాట్స్లో ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. పెద్దకాపర్తి ఫ్లై ఓవర్పై ఇప్పటికే ట్రాఫిక్ను అనుమతిస్తుండగా, సూర్యాపేటలోని ఫ్లై ఓవర్ ట్రాఫిక్ అనుమతికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగతావి డిసెంబర్ చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఎన్హెచ్-65 విస్తరణ పనులతోపాటు బుల్లెట్ ట్రైన్స్, ఇతర ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులు త్వరగా చేపట్టాలని కోరుతామని మంత్రి తెలిపారు. సమీక్షలో అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : ధాన్యం వేలంలో పూర్తి పారదర్శకత పాటిస్తామని, ఎలాంటి అవకతవకలకు చోటులేకుండా జెమ్ లేదా, తెలంగాణ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా వేలం వేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 17 లక్షల టన్నుల ధాన్యం వేలం ద్వారా విక్రయించేందుకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం మంత్రి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తదుపరి విడత వేలం ప్రారంభించే ముందే లాట్ పరిమాణాలు, బిడ్డింగ్ నిబంధనలు, వేలం నిర్వహించే వేదికలను ఖరారుచేయాలని అధికారులను ఆదేశించారు. డీఫాల్టర్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిల వసూలు వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు ప్రణాళికలు సిద్ధంచేయాలని సూచించారు.