జకర్తా, సెప్టెంబర్ 13: ఇండోనేషియాలోని జావా సముద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న నౌక నీటమునగడంతో 130 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని అధికారులు వివరించారు. విర్గో ట్రాన్స్పోర్ట్ 8 నౌక శనివారం ఉదయం తూర్పు జావాలోని సూరబాయ నుంచి దక్షిణ కాలిమంతన్లోని బంజర్మిసన్కు 243 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం నౌకతో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత పెనుగాలులకు ఓడ తిరగబడింది. సమాచారం అందుకున్న ఇండోనేషియా అధికారులు ఘటనా స్థలికి చేరుకుని 107 మందిని కాపాడారు. ఈ ప్రమాదంలో 130 మంది గల్లంతయ్యారని, ఆరు మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు.