హైదరాబాద్, డి సెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని, మరో గచ్చిబౌలిగా తీర్చిదిద్దుతామన్న మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నమ్మిన ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ బిలాల్కే అత్యధిక మంది ఓటేశారని తెలిపారు. మినీ భారత్గా పేరొందిన ఈ సెగ్మెంట్లో రెండు పర్యాయాలు గెలిచిన బీజేపీతో ఆశించిన ప్రగతి సాధించలేదనే ఆవేదన ఓటర్లలో ప్రస్ఫుటంగా కనిపించిందని పేర్కొన్నారు. ఉత్తరాదికి చెందిన వందలాది మంది వ్యాపారులు ఈ సారి బీఆర్ఎస్ వైపు నిలిచారని పేర్కొన్నారు.