హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కృషి ఫలితంగానే పారిశ్రామిక ప్రగతిలో రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన 56 పారిశ్రామిక వాడలు మంత్రి కేటీఆర్ పట్టుదల, చిత్తశుద్ధి, అంకిత భావానికి నిదర్శనమని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచ పారిశ్రామిక చిత్రపటంలో తెలంగాణను నిలపడంతో.. దేశవ్యాప్తంగా యువత మన రాష్ట్రంవైపు చూస్తున్నదని పేర్కొన్నారు.
డైనమిక్ లీడర్ కేటీఆర్ కారణంగానే నూతన పరిశ్రమలు తరలిరావడం.. తద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయనే భావన యువతలో కలుగుతున్నదని తెలిపారు. దావోస్లో తన అద్భుత ప్రసంగంతో పారిశ్రామిక దిగ్గజాల చూపును తెలంగాణ వైపు మళ్లించారని పేర్కొన్నారు. పరిశ్రమల అనుమతుల విషయంలో సీఎం కేసీఆర్ సరళీకృత విధానం అమలు చేయడంతో రాష్ట్రానికి అంతర్జాతీయ పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. గతేడాది రూ.45,190 కోట్ల నిధులను పెట్టుబడిగా తెలంగాణ వైపు మళ్లించడం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.