హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్ట్ కోవెల సంతోష్కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’ పుస్తకం సాహితీ ప్రపంచంలో నిశ్శబ్ద విప్లవంగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. కుహనా లౌకికవాదులు సాగించే దుష్ప్రచారాల నుంచి శ్రీరాముడిని రక్షించుకునేందుకు ఈ పుస్తకం ఒక పోరాట గ్రంథంగా నిలుస్తుందని కొనియాడారు. ‘రామం భజే శ్యామలం’ పుస్తకాన్ని ఆదివారం రవీంద్రభారతిలో శాంతాబయోటెక్స్ చైర్మన్ కేఐ వరప్రసాద్రెడ్డి ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త గన్నంరాజు గిరిజా మనోహర్బాబు అధ్యక్షతన నిర్వహించిన పుస్తకావిష్కరణ సభలో వరప్రసాదరెడ్డి, కోవెల సుప్రసన్నాచార్య, పాణ్యం దత్తశర్మ, కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ.. శ్రీరాముడు ధర్మస్వరూపుడని, మానవతా విలువలను నేర్పింది రామాయణమేనని పేర్కొన్నారు.
స్వాతంత్య్రానంతరం రాముడి వ్యక్తిత్వాన్ని దిగజార్చి, రామాయణ చరిత్రను తక్కువ చేసి చూపించేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సహేతుకం కాదని అన్నారు. రాముడితోపాటు రామాయణ చరిత్రపై జరిగే దాడులను తిప్పకొట్టేందుకు కోవెల సంతోష్కుమార్ శాస్త్రీయంగా, ఆధారాలతో రచన సాగించారని అభినందించారు. నాటి భారతీయ సమాజాన్ని ఏకీకృతం చేసింది శ్రీరాముడేనని రుజువులతో సహా రచయిత నిరూపించారని పేర్కొన్నారు. మైనార్టీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాముడి వ్యక్తిత్వాన్ని తగ్గించేందుకు, ప్రత్యామ్నాయంగా బుద్ధుడు, అశోకుడిని చూపి రాముడిపై దుష్ప్రచారం చేశారని విమర్శించారు.
రాముడి పట్టాభిషేకం కోసం దశరథుడు రెఫరెండం నిర్వహించారని, రామాయణంలోనే ప్రజాస్వామ్య పునాదులకు బీజం పడిందని, రెఫరెండంతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని చెప్పారు. వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పిన అంశాలను ఆధారాలతో రచయిత క్రోడీకరించారని చెప్పారు. శ్రీరాముడిపై వచ్చే విశ్వశనీయత లేని అంశాలను తిప్పికొట్టాలని, ఆర్యులు, ద్రావిడుల జన్యువు ఒక్కటేనని పుస్తకం నిరూపించిందన్నారు. ఈ పుస్తకానికి డాక్టరేట్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
కారణం.. ప్రేరణ ఫేస్బుక్కే: రచయిత కోవెల
తాను ‘రామం భజే శ్యామలం’ గ్రంథాన్ని రాయడానికి ఫేస్బుక్, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వక్రీకరణలే ప్రేరణగా నిలిచాయని రచయిత కోవెల సంతోష్కుమార్ చెప్పారు. ఆయా వక్రీకరణలు తనను కలిచివేశాయని, అందుకే రాముడు కేంద్రంగా భారతీయత ఆత్మను ఆవిష్కరించేందుకు కృషిచేశానని వివరించారు. దేశ స్వాతంత్య్రానంతరం రాముడిపై జరిగిన కుట్రను తెలియజెప్పేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ఇంగ్లిష్, హిందీతోపాటు పలు భాషల్లోకి తర్జుమా చేయించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.