హైదరాబాద్, మే 26: కేరళలో బయటపడ్డ ‘గ్లోబల్ కిడ్నీ రాకెట్’లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ప్రధాన సూత్రధారిగా హైదరాబాద్కు చెందిన ఓ వైద్యుడు, మరికొంత మంది ఉన్నారని కేరళ పోలీసుల విచారణలో తేలింది. కేరళతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ అవయవ రాకెట్ ఆ రాష్ట్ర పోలీసులు ఇటీవల చేధించారు. ఇరాన్ నుంచి ఇండియాకు బయల్దేరిన సబిత్ నాసిర్ అనే వ్యక్తిని కొచ్చి విమానాశ్రయంలో అక్కడి పోలీసులు అరెస్టు చేసి, కూపీ లాగారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడే ఈ రాకెట్కు ప్రధాన సూత్రధారిగా నాసిర్ వెల్లడించాడు.
తెలంగాణ, కర్ణాటక పేద యువతే టార్గెట్
కేరళ పోలీసులు చెబుతున్నదాని ప్రకారం, కిడ్నీ రాకెట్ను నడుపుతున్న ముఠాలోని వ్యక్తులు కర్ణాటక, తెలంగాణలోని పేద యువతను టార్గెట్ చేసుకున్నారు. కిడ్నీలను అమ్మితే.. రూ.20లక్షలు ముట్టజెబుతామని ముఠాలోని వ్యక్తులు తొలుత వారిని నమ్మిస్తున్నారు. పాస్పోర్ట్, వీసాలను ఏర్పాటుచేసి ఇరాన్కు పంపుతున్నారు. అక్కడ కిడ్నీ అవయవ మార్పిడి ఆపరేషన్లు చేసి.. రికవరీ అయ్యాక దాతలను ఇండియాకు పంపుతున్నారు. చివరికి రూ.6 లక్షలు చేతిలో పెడుతున్నారని తెలిసింది. కేరళకు చెందిన ఓ కిడ్నీ దాత చనిపోవటంతో, అతడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ముఠా వ్యవహారం బయటపడింది. బెంగళూరు, హైదరాబాద్ నుంచి 40 మందిని ఇరాన్కు తీసుకెళ్లినట్టు సబిత్ నాసిర్ పోలీస్ విచారణలో ఒప్పుకున్నాడు.
నన్ను బలవంతంగా తీసుకెళ్లారు
బలవంతంగా తనతో కిడ్నీని అమ్ముకునేట్టు చేశారని కేరళలోని నిడుంపోయిలికి చెందిన ఓ గిరిజన మహిళ అక్కడి పోలీసుల్ని ఆశ్రయించారు. రూ.9 లక్షలకు తాను కిడ్నీని అమ్ముకున్నానని, ఇందుకు కారణం తన భర్త, ఓ ఏజెంట్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.3లక్షలు కమీషన్ ఇవ్వాలంటూ తనను డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. కిడ్నీరాకెట్ ముఠా గత ఏడాదిన్నర కాలంగా తనను, తన కుటుంబంలోని ముగ్గురు పిల్లలపైనా కన్నేసిందని ఆమె ఆరోపించారు.
– భర్త, ఏజెంట్పై కన్నూర్ గిరిజన మహిళ ఆరోపణ