హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో వరి వద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారన్నారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మంత్రి వరి వద్దన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రైతుల ఆత్మహత్యలు, చాలా కకావికలమైన వ్యవసాయం, వలసలు, పాలమూరు, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి రైతులు కూడా కూలి పనుల కోసం హైదరాబాద్కు రావడం.. దారుణ పరిస్థితులుండేవన్నారు.
రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ప్రజలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశాన్ని అధికార రూపంలో కట్టబెట్టారన్నారు. స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మకమైన పద్ధతిలో ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి.. పల్లెలు చల్లగా ఉండేటట్లు చేయాలి.. వృత్తి పనులందరికీ పనులు దొరకాలని అనే స్పష్టమైన పాలసీని తీసుకున్నామన్నారు. ఆ దిశలో బలమైన అడుగులు రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నారు. అందులో మొట్టమొదట మొదలు పెట్టింది.. అడుగంటి పోయిన భూగర్భ జలాలను పెంచేందుకు.. మిషన్ కాకతీయ పేరిట చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆ తర్వాత చాలా అస్తవ్యస్తంగా.. లోపభూయిష్టంగా ఉన్న కరెంటును పూర్తిగా సంస్కరించి.. అనేక పెట్టుబడులు పెట్టి.. 24 గంటలు అన్ని రంగాలకు భారతదేశంలో మరో రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చామన్నారు. అది సరిపోదని పెట్టుబడుల కోసం 93శాతం సన్న, చిన్నకారు రైతులకు కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేసినట్లు చెప్పారు. మొదట పంటకు రూ.4వేలతో ప్రారంభించి.. దాన్ని రూ.5వేలకు పెంచి.. ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలు పెట్టుబడి కోసం ఇచ్చే ప్రభుత్వం ప్రపంచంలోనే ఒకేఒకటి తెలంగాణ ప్రభుత్వం.. చితికిపోయిన రైతులు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకు దాదాపు రూ.1300-రూ.1400 కోట్లు యావత్ రైతాంగానికి సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది.. రైతులపై పైసా భారం లేకుండా రైతుబీమా పథకం అమలు చేశామన్నారు.
పథకం ప్రారంభించిన రోజు ఎల్ఐసీ చైర్మనే తెలంగాణ రాష్ట్రం ఎల్ఐసీకి పెద్ద కస్టమర్ అని చెప్పారని గుర్తు చేశారు. గతంలో విత్తనాలు సరిగా దొరికేవి కావని.. కల్తీ విత్తనాలు ఉండేవన్నారు. కేంద్రంతో కొట్లాడి, ఒప్పించి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ తీసుకువచ్చామన్నారు. పీడీ యాక్ట్ దేశంలో తెలంగాణలో తప్ప మరెక్కడా అమలులో లేదన్నారు. ఈ విషయంలో కేంద్రం సతాయించిందని, రైతుల శ్రేయస్సు కోసమే యాక్ట్ తీసుకువచ్చామన్నారు.
గతంలో ఎరువులు దొరికేవి కావని.. రోజుల తరబడి రోజుల తరబడి లైన్లలో నిల్చోవడం.. గలాటాలు కావడం.. చివరకు పోలీస్స్టేషన్ల ఎరువు బస్తాలు పెట్టిన రోజులు చూశామన్నారు. ఆ రోజు మొత్తం వాడిన ఎరువుల్లో.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. రెండు పంటలకు కలిపి 50-55లక్షల టన్నుల ఎరువులు వాడకం జరుగుతుందన్నారు. గతంలో 13-14లక్షలుంటేనే పోలీస్స్టేషన్లలో పెట్టి విక్రయించారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి ఎండాకాలంలో ఏ రాష్ట్రం తీసుకోని సమయంలో తీసుకున్నామని.. ఆగమేఘాలపై గోడౌన్లు నిర్మించామన్నారు. మంచి విత్తనాలు, ఎరువులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి, 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, పెట్టుబడికి రైతుబంధు, దురదృష్టవశాత్తు రైతు మరణస్తే రైతుబీమా తదితర చర్యలతో రాష్ట్రంలో అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ గ్రామాల్లోనే 6వేలకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు మార్కెట్కు రాకుండా, రైతులు గుమిగూడకుండా నెలల తరబడి వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. గత ఏడేళ్ల కింద పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రతి రైతును అడిగినా చెబుతారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు.. దేశంలో ఆహార కొరత సంభవించినప్పుడు.. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసేందుకు బాధ్యతను కేంద్రంపై పెట్టారు. అందులో నుంచి పుట్టుకు వచ్చిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ఎఫ్సీఐ దేశవ్యాప్తంగా ఎన్ని తాలూక సెంటర్లు ఉన్నాయా.. అక్కడ సైంటిఫిక్ గోడౌన్లు ఉంటాయన్నారు. ఇలాంటి అవకాశాలు రాష్ట్రాల వద్ద ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. సైంటిఫిక్ గోడౌన్లు ఉన్న ఏకైక సంస్థ ఎఫ్సీఐ అన్నారు. ధాన్యం ఎగుమతి చేయాలన్నా.. విత్తనాలకు వినియోగించాలన్న కేంద్రానిదే అధికారం అన్నారు. ఈ అధికారి ఏ రాష్ట్రానికి లేవని.. తెలంగాణకు కూడా లేవని విషయం స్పష్టమన్నారు. రాష్ట్రాలు, దేశంలో కరువు కాటకాలు వచ్చిన సమయంలో ఫుడ్ సప్లయ్కి ఢోకా లేకుండా చేసే బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి.. బాధ్యతా రాహిత్యంగా ధాన్యం తీసుకోమని.. మెడకు పెడితే.. కాళ్లకు.. కాళ్లకు పెడితే మెడకు పెడుతూ మెలికలు తిప్పుతుందన్నారు. దీనిపై అధికారులు, సివిల్ సప్లయ్ మంత్రి, పరిశ్రమల మంత్రి, వ్యవసాయశాఖ మంత్రులు ఢిల్లీకి వెళ్లారన్నారు.
ఎఫ్ఐసీ ఎంఓయూ చేస్తుందని.. కేంద్రం నిరాకరిస్తుందన్నారు. ధాన్యం సేకరించిన విషయంలో రాష్ట్రాలు ఏమి చేయని పరిస్థితి ఉందని.. నిల్వ చేసే పరిస్థితి లేదని.. ఎగుమతి చేసే అధికారం లేదన్నారు. మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లాలని.. నిల్వ చేసేందుకు గోడౌన్లు లేవన్నారు. రాష్ట్రం ఏమీ పరిస్థితి లేదన్నారు. గతంలో లెవీ సేకరణ ఉండేదని.. ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. నెల రోజుల కిందట స్వయంగా ఢిల్లీకి వెళ్లిన సమయంలో వ్యవసాయశాఖ మంత్రిని కలిసి మాట్లాడనని, ఎఫ్సీఐ ఎంఓయూ చేయడం.. మీరు నిరాకరించడంపై సరైంది కాదనన్నారు. సంవత్సరం టార్గెట్ ఎంత రాష్ట్రం నుంచి ధాన్యం తీసుకుంటారో చెప్పాలని కోరానన్నారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించుకుంటామని చెప్పినట్లు పేర్కొన్నారు.