కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 29: రూ.లక్ష లంచం తీసుకొంటూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ట్రాన్స్కో ఏఈ సురేశ్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణాగౌడ్ వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో చంద్రభాస్కర్, శ్రీనివాసులు రెండు వెంచర్లలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఇతర పనుల కో సం హైదరాబాద్కు చెందిన ప్రభాకర్ అనే కాంట్రాక్టర్ను సంప్రదించారు. అతను కల్వకుర్తి విద్యుత్తు కార్యాలయంలో ఏఈ సురేశ్ని కలిశారు.
ఒక్కో వెంచర్ నుంచి రూ.యాభై వేల చొప్పున రూ.లక్ష ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. మరో మూడు వెంచర్ల నిర్వాహకులను ఇదే తరహాలో డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ప్రభాకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం సాయంత్రం కారులో ప్రభాకర్ నుంచి ఏఈ సురేశ్ రూ.లక్ష లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నామని, శనివారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.