వరంగల్ : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు సభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి దాదాపు 12 మంది నుంచి రూ. 8.40 లక్షల వరకు వసూలు చేశారు.
ఎన్ని రోజులైనా ముఠా సభ్యుల నుంచి స్పందన లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు వీసాలు, ఐదు పాస్పోర్టులు, విమాన టికెట్, మూడు సెల్ఫోన్లు, ఓ కంపెనీకి చెందిన ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎండీ ఇర్ఫాన్, ఎండీ అర్షద్ పాషా, ఎండీ ఖాసింలుగా గుర్తించారు.