హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్లో కోర్ కోర్సులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించేందుకు జవహర్లాల్నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) చర్యలు చేపట్టింది. ఇంజినీరింగ్ కాలేజీలన్నింటిలో కోర్ కోర్సులను కొనసాగించేలా నిబంధనలు అమలుచేస్తున్నది. కోర్ కోర్సులను పూర్తిగా రద్దుచేయరాదని నిర్ణయించింది. బీటెక్లో సీఎస్ఈ, ఐటీ, డాటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్లెర్నింగ్ తదితర కోర్సుల రాకతో కోర్కోర్సులకు కష్టకాలం వచ్చిపడింది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నది. కాలేజీలన్నీ కోర్ కోర్సులను మూసివేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది కోర్ కోర్సులకు సంబంధించి 2010 సీట్లు రద్దయి.. సీఎస్ఈ సీట్లు పెరిగాయి. దీంతో ఉత్పాదక రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు బీటెక్ రెండోసంవత్సరంలో ప్రవేశాలు కల్పించడం గగనమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ అధికారులు పటిష్టమైన నిబంధనలను రూపొందించారు.