హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్నది. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఈ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అవసరమయ్యే డాక్యుమెంట్లు, ఫొటోలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షల తేదీలను ప్రకటించింది. జేఈఈ మొదటి విడత పరీక్ష 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ రెండవ విడత పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కొనసాగుతుంది. పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.