హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై తలెత్తిన సందేహాలను పటాపంచలు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో పరీక్షలు ఈ నెల 23 నుంచి 29 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంగళవారం స్పష్టం చేసింది. మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 నుంచి, రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని తెలిపింది.
జేఈఈ మెయిన్-1 అడ్మిట్కార్డులను, పరీక్ష సమయంలో విద్యార్థులు సమర్పించాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్/అండర్టేకింగ్ ఫామ్లను jeemain.nta.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, మంగళవారం నుంచే వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ వెల్లడించారు. అడ్మిట్కార్డుల డౌన్లోడింగ్లో సమస్యలుంటే 011-40759000 ఫోన్ నంబర్ను లేదా jeemain@nta.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు తమ అడ్మిట్కార్డు, కొవిడ్ వ్యాధి లేదన్న స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్)తోపాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, పారదర్శకమైన వాటర్ బాటిల్, హ్యాండ్ శానిటైజర్, మాస్కు, బాల్పాయింట్ పెన్ తెచ్చుకోవాలని వివరించారు.
పరీక్షా కేంద్రాలు
దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభంకాగానే విద్యార్థుల నుంచి హాల్టికెట్లను తీసేసుకొంటారు. పరీక్ష పూర్తయ్యే వరకు విద్యార్థులంతా పరీక్షా కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు తెలంగాణ నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలో రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కేంద్రాలతోపాటు హయత్నగర్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హైదరాబాద్లో ని వివిధ కేంద్రాల్లో జేఈఈ మెయిన్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 (బీఈ, బీటెక్), పేపర్-2ఏ (బీఆర్క్), పేపర్-2బీ (బీ ప్లానింగ్) పరీక్షను 3 గంటలపాటు నిర్వహిస్తారు. బీఆర్క్ అండ్ బీప్లానింగ్ రెండు పేపర్లకూ హాజరయ్యే విద్యార్థులకు 3.30 గంటల పాటు పరీక్ష జరుగుతుంది. మొదటి షిఫ్ట్ విద్యార్థులను ఉదయం 7 నుంచి.. రెండో షిప్ట్ విద్యార్థులను మధ్యాహ్నం 1 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
సెక్షన్-బీలో నెగెటివ్ మార్కులు
ఈ ఏడాది సెక్షన్-బీలో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో సెక్షన్-ఏ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల)కి మాత్రమే పరిమితమైన నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని గత ఏడాది సెక్షన్-బీలోనూ ప్రవేశపెట్టారు. సెక్షన్-బీలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో ఒక్కో సబ్జెక్టు నుంచి 10 చొప్పన మొత్తం 30 ప్రశ్నలిస్తున్నారు. వీటిలో 15 ప్రశ్నలకు మాత్రమే విద్యార్థులు జవాబులు రాయాలి. తప్పుడు జవాబులు రాస్తే మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.