ఇబ్రహీంపట్నం/కోరుట్ల/వేల్పూర్, జూలై 15: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు, రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శుక్రవారం పలుచోట్ల నిరసన సెగ తగిలింది. వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను జగిత్యాల జిల్లా ఇబ్రంహీంపట్నం మండలంలోని ఎర్దండిలో గ్రామస్థులు అడ్డుకొన్నారు. ‘గో బ్యాక్ అర్వింద్’ అంటూ నినదించారు. వరదలు తగ్గిన తర్వాత వచ్చి ఏం చేస్తారని నిలదీశారు. గ్రామంలోని 104 సర్వే నంబర్లో 124 ఎకరాల భూ సమస్యను పరిష్కరించాలని కోరినా ఎందుకు తాత్సా రం చేస్తున్నారం టూ మండిపడ్డా రు. ఇచ్చిన హామీ లు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చారని నిలదీశారు. గ్రామస్థులపై ఎంపీ వెంట వచ్చిన బీజేపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. గ్రామస్థులు, బీజేపీ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అలాగే కోరుట్ల 10 వార్డులోనూ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. వరదల్లో చిక్కుకొన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
వేల్పూర్లోనూ నిరసన..
‘ఎంపీ అర్వింద్ మా కాలనీకి రావొద్దు.. గోబ్యాక్’ అంటూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మహిళలు గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. అర్వింద్ వేల్పూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించడానికి వస్తున్నారని తెలుసుకొన్న మహిళలు, డబుల్ బెడ్రూం ఇండ్ల వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తమకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని, ఇండ్లు లేనివారికి ఇండ్లు కట్టించారని స్పష్టంచేశారు. రాజకీయ లబ్ధికోసమే ఎంపీ అర్వింద్ గ్రామాల్లో తిరుగుతున్నారని వారు దుయ్యబట్టారు. వేల్పూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ఎంతో నాణ్యతతో నిర్మించారని, అన్ని పనులు పూర్తయిన తరువాత ఎంపీ ఇక్కడికి రావడం ఎందుకని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఎంపీ అర్వింద్ ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మహిళలు నిరసనకు దిగిన విషయం తెలుసుకొన్న అర్వింద్ వేల్పూర్కు రాకుండా ముఖం చాటేశారు.