Jangaon | మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 1: జనగామ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. కిందిస్థాయి నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని పలువురు ఆ పార్టీ నేతలు కినుక వహించారు. ధూళిమిట్ట మండలంలోని ఉమ్మడి కొండాపూర్ గ్రామానికి చెందిన పలువురు గిరిజన నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. బుధవారం ఓ రహస్య ప్రదేశంలో 30 మందికి పైగా కాంగ్రెస్ గిరిజన నేతలు సమావేశమైనట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని గిరిజన నేతలు ఆరోపించారు.
ఆయన తీరుపై మండిపడ్డారు. ఉమ్మడి కొండాపూర్ గ్రామంలో సుమారు 3వేలకు పైగా గిరిజన ఓట్లు ఉన్న తమకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం కల్పించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే మూడు రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపినట్లు సమాచారం. కాగా, ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో కాంగ్రెస్ గ్రామ కమిటీని వేసేందుకు సమావేశమైనట్టు పలువురు నాయకులు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ కవరింగ్ ఇవ్వడం కొసమెరుపు.