రాష్ర్టాలకు కేంద్ర జల్శక్తిశాఖ ఆదేశాలు
ఇటీవలే జారీ చేశామని తెలంగాణ వెల్లడి
హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను వెంటనే అన్ని రాష్ర్టాలు నోటిఫై చేయాలని, అందులోభాగంగా రాష్ట్రస్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. ఈ నెల 30 నుంచి ఆ చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో గురువారం కేంద్ర జల్శక్తిశాఖ న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో అన్ని రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సమావేశానికి తెలంగాణ నుంచి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజినీర్ జడ్ శ్రీనివాస్రావు, ఈఈ రఘునాథ్శర్మ హాజరయ్యారు. డ్యామ్ సేఫ్టీ చట్టానికి అనుగుణంగా తెలంగాణ ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ చైర్మన్గా రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వారు వెల్లడించారు. త్వరలోనే ఇతర అధికారుల నియామకం చేపట్టనున్నట్టు వివరించారు. మిగిలిన రాష్ర్టాలు కూడా వెంటనే రాష్ట్ర అథారిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.