హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో గత డిసెంబర్ 26 నుంచి శుక్రవారం వరకు జరిగిన ‘ఆలిండియా 42వ పోలీస్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్షిప్ అండ్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్’లో ఓవరాల్ చాంపియన్గా ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్’ (ఐటీబీపీ) నిలిచింది. మొత్తం 120 పాయింట్లు సాధించి మొదటిస్థానాన్నికైవసం చేసుకొన్నది. 73 పాయింట్లతో అస్సాం రైఫిల్స్ రన్నరప్గా నిలిచింది. మౌంటెడ్ పోలీస్ డ్యూటీ విన్నర్గా హైదరాబాద్కు చెందిన జాతీయ పోలీస్ అకాడమీ నిలిచింది. ఈ పోటీల్లో బెస్ట్ హార్స్గా రాజస్థాన్కు చెందిన రూహి, ఉత్తమ రైడర్గా రాజస్థాన్కు చెందిన డీఎస్పీ జితేందర్సింగ్, బెస్ట్ ఉమెన్ రైడర్గా అస్సాం రైఫిల్స్కు చెందిన అవంతి లోధి ఎంపికయ్యారు.
చాలా గర్వంగా ఉన్నది..
గుర్రపుస్వారీలో 14 మంది మహిళలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది. నేను ఎన్నో విభాగాల్లో గట్టి పోటీ ఇచ్చా. షో జంపింగ్లో గోల్డ్ మెడల్, హ్యాక్స్లో రజతం, డ్రస్సేజ్ ప్రిలిమినరీలో 4వ స్థానంలో నిలిచా. మొత్తంగా ఉత్తమ మహిళా రైడర్గా ఎంపికవడం గర్వంగా ఉన్నది.
– అవంతి లోధి, ఉత్తమ మహిళా రైడర్, అస్సాం రైఫిల్స్