హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతతోపాటు వలస కార్మికుల ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ వలసల సంస్థ(ఐవోఎమ్), అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సీఎస్ను కలిసింది.
తెలంగాణలో వలస కార్మికులకు అవకాశం కల్పించాలని, ఉపాధి మార్గాలను చూపించాలని బృందం కోరింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని వివరించారు. నిరుద్యోగ యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్కామ్) ప్రత్యేకంగా పనిచేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే నర్సులకు శిక్షణతోపాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణికుముదిని, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్రెడ్డి, ఐవోఎమ్ ఆఫీస్ హెడ్ సంజయ్ అవస్థి, ఐఎల్వో డైరెక్టర్ డాగ్మార్ వాల్టర్ తదితరులు పాల్గొన్నారు.