హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మారింది. తొలుత ప్రకటించిన జూన్ 4 కాకుండా 12 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్, 6 నుంచి 8 వరకు మరికొన్ని పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 12 నుంచి 20 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ పరీక్షల సమయసారిణి (షెడ్యూల్) విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్ వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 5 నుంచి 9 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కొనసాగుతాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూన్ 21న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 22న నిర్వహిస్తారు.