హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమైన టీ హబ్, టీ వర్క్స్ ఫలాలు కనిపించటం మొదలైంది. టీ హబ్లో మొక్కలుగా మొదలైన స్టార్టప్లు ఆకాశమే హద్దుగా వడివడిగా విస్తరిస్తూ మంత్రి కేటీఆర్ కలలను సాకారం చేస్తున్నాయి. తాజాగా టీ హబ్లో మొలకగా మొలిచిన ఒక స్టార్టప్ అంతరిక్షంలో తెలంగాణ విజయ పతాకను సగర్వంగా ఎగురవేసింది. దేశంలో ప్రైవేటు రంగంలో విజయవంతంగా రాకెట్ను ప్రయోగించిన స్కైరూట్ సంస్థ టీ హబ్లో పురుడుపోసుకొన్నదే. వారం తిరగకుండానే హైదరాబాద్కే చెందిన మరో ప్రైవేటు సంస్థ ధ్రువ స్పేస్ సొంత ఉపగ్రహాలను శనివారం నింగిలోకి పంపుతున్నది. స్కైరూట్ సంస్థ దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-ఎస్ను విజయవంతంగా ప్రయోగించటంపై ఐటీ శాఖమంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. అంతరిక్ష సాంకేతికతకు హబ్గా హైదరాబాద్ మారుతున్నదని తెలి పారు. విక్రమ్ -ఎస్ రాకెట్ విజయోత్సవ కార్యక్రమాన్ని టీ హబ్లో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. స్కైరూట్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. స్కైరూట్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి రూపొందించిన టీ షర్ట్ను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
బాల్యంనుంచే సృజనాత్మక ఆలోచనలను విద్యార్థుల్లో అలవర్చాలని కేటీఆర్ అన్నారు. ‘జపాన్ పర్యటనలో భాగంగా సుజుకి ఆటోమొబైల్ కంపెనీ చైర్మన్ను కలిసేందుకు వెళ్లాం. అక్కడ సమయ పాలన చాలా కీలకం. అందుకే మేం ముందుగానే అక్కడికి చేరుకొన్నాం. కంపెనీలో ఒక మ్యూజియం ఉన్నది. అందులో సుజుకి తయారుచేసిన పురాతన నమూనాలున్నాయి. అదే సమయంలో 2, 3 తరగతులు చదువుతున్న చిన్నారులు అక్కడికి వచ్చి ఆటో మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఉత్పత్తులను చూస్తున్నారు. పిల్లలు ఈ వయసులో ఇక్కడి వచ్చారెందుకని నేను ప్రశ్నించాను. అక్కడ ఒక కియోస్క్ వెండింగ్ మిషన్ తరహా యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో పిల్లలు తమకు నచ్చిన రీతిలో కారు రంగు, బాడీ, మాడల్ను ఎంచుకొని క్లిక్ చేస్తే వారికి ఒక బొమ్మ రూప ంలో కారు తయారై బయటకు వస్తుంది. అంటే అక్కడ చిన్న వయసులోనే పిల్లల సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. స్వయం పరిశీలన ద్వారా వారు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నట్టుగా మన దగ్గర డిజైన్ ఇన్నోవేషన్ థింకింగ్ లేదు. ఆ అవకాశాన్ని ఇక్కడి పిల్లలకు కల్పించాల్సిన అవసరం ఉన్నది. అది మనం మిస్ అవుతున్నాం’అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ కేంద్రంగానే తమ కంపెనీని మరింత ముందుకు తీసుకుపోయే ప్రణాళికలు ఉన్నాయని సైరూట్ ప్రతినిధులు ఈ సందర్భంగా కేటీఆర్కు తెలిపారు. రాష్ట్రంలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని మంత్రి ని కోరారు. తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అద్భుత ఆలోచనలకు వాస్తవ రూపం ఇచ్చేలా టీ హబ్, టీ వర్స్ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని సైరూట్ ఏరో స్పేస్ కంపెనీ యాజమాన్యం కొనియాడింది. తమ విజయ ప్రస్థానంలో ఈ రెండు సంస్థల పాత్ర మరువలేనిదని తెలిపింది. 200 మంది సైరూట్ సిబ్బంది కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉన్నదని ఆ కంపెనీ ప్రతినిధి పవన్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే భవిష్యత్తులోనూ తమ కంపెనీ విస్తరిస్తుందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన అన్ని విభాగాల్లో నైపుణ్యమున్న వ్యక్తులు అందుబాటులో ఉండటంతోపాటు హైదరాబాద్లోని సానుకూల వాతావరణం వల్లనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.
స్కైరూట్ విజయం గూస్బంప్ మూమెంట్ లాంటిదని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ‘తాజాగా మళ్లీ నగరానికి చెందిన ధ్రువ స్పేస్ కంపెనీ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతున్నది. అది కూడా విజయవంతమైతే భారతదేశానికి హైదరాబాద్ నగరం స్పేస్టెక్ క్యాపిటల్గా మారుతుంది’ అని పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకులను చేదించుకొని విజయవంతంగా దూసుకెళ్లిన విక్రమ్ -ఎస్ రాకెట్ ప్రయోగం మనందరికీ ఎంతో గర్వకారణంగా నిలిచిందని, మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. ‘మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్ ప్రయోగం అంటే మామూలు విషయం కాదు. దానిని స్కైరూట్ స్టార్టప్ సాధించింది. ఈ విజయం వెనక ఎంతో శ్రమ ఉన్నది. దీనికి రూ.కోట్లలో నిధులు అవసరం. నిర్వాహకులు ఎన్నో ప్రయత్నాలు చేసి నిధులు సమకూర్చుకొని రాకెట్ను టీ వర్క్స్లోనే రూపొందించారు. స్పేస్టెక్ రంగంలో దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనంత చొరవను తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్నది’ అని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఐటీ శాఖ స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్ పేరుతో పాలసీని రూపొందించిందని గుర్తుచేశారు.