హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ (టీఎస్సీఎస్బీ), సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా కరపత్రాలు ముద్రించి బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో జారవిడుస్తున్నారు. ఇవి అచ్చం మనీ పర్సులను పోలినట్టుగా, పర్సులోంచి ఓ 500 నోటు బయటకు వచ్చినట్టుగా ఉన్నాయి. ఎవరో పర్సు పడేసుకున్నారని దానిని తీస్తే అందులో 1930 టోల్ ఫ్రీ నంబరు కనిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి నవ్వు తెప్పిస్తున్నాయి. ఆలోచన సైతం రేకెత్తిస్తున్నాయి. ఆ కరపత్రం పర్స్ తెరవగానే.. సైబర్ నేరగాళ్లు కూడా ఇలానే మిమ్మల్ని మోసం చేస్తారు. అసలేదో.. నకిలీ ఏదో గుర్తించి జాగ్రత్తగా ఉండండి. మీరు డబ్బులు పోగొట్టుకొంటే వెంటనే 1930కి కాల్ చేయండి. అప్రమత్తంగా, సురక్షితంగా ఉండండి.. టీఎస్-సీఎస్బీ అని వాటిపై రాసి ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ సైబర్ సెక్యూరిటీ బృందాలు ఇలాంటి అవగాహన కల్పించాయి. రోడ్లపై మనీపర్స్ కరపత్రాలు వేసి ప్రజల స్పందనను దూరం నుంచి గమనిస్తూ వీడియోలు తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 1930 కాల్సెంటర్ ఉందని, మామూలుగా ప్రచారంచేస్తే ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదనే ఈ తరహా వినూత్న ప్రచారం చేపట్టినట్టు తెలిపారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేస్తే ఆర్థిక నష్టం ఆపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.