హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయశాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. ‘సత్వర న్యాయం-సమ న్యాయం’ అంటూనే న్యాయశాఖ లక్ష్యాలను తుంగలో తొక్కింది. న్యాయశాఖలో అవసరమైన మౌలిక వసతులకు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామంటూనే అతి తక్కువగా కేటాయింపులు చేసింది. ఈ బడ్జెట్లో న్యాయశాఖకు రూ.2,367 కోట్లను కేటాయించగా.. హైకోర్టు, జడ్జిల నివాసాలను రూ.2,583 కోట్లతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నామని బడ్జెట్లో పొంతనలేని విధంగా మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతోపాటు 11 జిల్లా కోర్టులు, 2 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, మరో 46 కోర్టుల నిర్మాణానికి అనుమతులిచ్చామని అన్నారు.
న్యాయశాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి లేకపోవడంతో అక్కడ జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించేవారు లేరని పలువురు న్యాయవాదులు వాపోతున్నారు. 2024-25 బడ్జెట్లో రూ.3,245 కోట్లు, 2025-26లో రూ.2,453 కోట్లు, 2026-27లో రూ.2,367 కోట్లు కేటాయింపులు చేస్తూ.. వరుసగా తగ్గిస్తూ వచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, న్యాయ సేవలను మెరుగుపరచడంలో భాగంగా కోర్టుల ఆధునికీకరణ, న్యాయ వ్యవస్థ బలోపేతానికి ఈ నిధులు ఎటూ సరిపోవని న్యాయవాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర న్యాయశాఖలో సిబ్బంది కొరత, లక్షల కేసుల పెండింగ్ సహా అనేక సవాళ్లు ఉన్నా యి. వెరసి బాధితులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతున్నదని న్యాయవాదులు అంటున్నారు.