మహబూబ్నగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ స్థాయిలో బీసీ ఉద్యోగులకు తీవ్రమైన అన్యా యం జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే అందులో బీసీలు కేవలం 7.50 లక్షల మంది మాత్రమేనని పేర్కొన్నారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 14 శాతం ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మహబూబ్నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. కేంద్రం బీసీలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి 28 ఏండ్లు అయిన తర్వాత కూడా ఉద్యోగుల శాతం పెరగకపోవడం చూస్తే కేంద్ర ప్రభుత్వాల పనితీరు అర్థమవుతుందన్నారు.
బీసీ ఉద్యోగుల సంఖ్య 14 శాతం దాటకపోవడం శోచనీయమన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతుందన్నారు. విద్యా, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లపై క్రీమిలేయర్ నిబంధన విధించిన తీరు ముమ్మాటికీ బీసీలపై వివక్షేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎన్సీసీ, మహిళా రిజర్వేషన్లలో లేని క్రీమిలేయర్ బీసీలపై మాత్రమే ఎందుకు అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు రాంకోఠి, రాష్ట్ర బీసీ సేనా అధ్యక్షుడు కృష్ణయాదవ్ పాల్గొన్నారు.