హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: శ్రీశైలం రిజర్వాయర్కు వరద కొనసాగుతున్నది. మంగళవారం సాయంత్రానికి 3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.20 అడుగులకు చేరింది. నీటి నిల్వ 159.76 టీఎంసీలకు పెరిగింది. 24 గంటల్లోనే సుమారు 25 టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు మొత్తం సామర్థ్యంలో మూడొంతులు నిండినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండటంతో గేట్లు అన్ని ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల సైతం 80 శాతం నిండింది. గోదావరి బేసిన్లో ప్రధాన ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గింది. ఎల్లంపల్లి వద్ద మాత్రం 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నది. వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. మరోవైపు భారీ వరద తాకిడికి గురైన కడెం ప్రాజెక్టు పరిస్థితిని అంచనా వేసేందుకు, మరమ్మతులు చేసేందుకు అధికారులు రిజర్వాయర్ను సగానికి ఖాళీ చేశారు.