మంచిర్యాల ఏసీసీ, మే 6 : నవమాసాలు మోసిన ఆ తల్లి తనకు పుట్టిన బిడ్డను కన్నులారా చూసుకోకముందే కాటికి చేరింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్.. భార్య రవళిక (26) తొమ్మిది నెలల గర్భిణి. పురిటినొప్పులు రావడంతో సోమవారం మంచిర్యాలలోని నందిని నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. వైద్యురాలు పరీక్షించి ఉదయం 11 గంటలకు నార్మల్ డెలివరీ చేసింది. రవళికకు రక్తం తక్కువగా ఉందని, వెంటనే రక్తం ఎక్కించాలని కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు బయటకు వెళ్లారు.
రక్తస్రావం ఎక్కువ కావడంతో వైద్యులు మెడిలైఫ్కు తరలించగా చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పట్టణ సీఐ బన్సీలాల్ సిబ్బందితో చేరుకొని రవళిక కుటుంబ సభ్యులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు. బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు.