Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కొత్వాల్గూడలోని ఎకో పార్కులో రూ.2.34 కోట్లతో దేశంలోనే అతిపెద్ద పక్షిశాలను హెచ్ఎండీఏ నిర్మిస్తున్నది. వివిధ పనులకు టెండర్లు పిలిచి పనులు వేగంవంతంగా చేయిస్తున్నది. పక్షుల అభయారణ్యంలా ఉండేలా సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు రెండు రోజుల కిత్రం టెండర్లు పిలిచింది. ఇప్పటికే ఎకో పార్కుకు అనుసంధాన రహదారితో పాటు పార్కింగ్ ప్రదేశం నిర్మాణం కోసం రూ.1.95 కోట్లతో పనులు చేపట్టింది. వీటితోపాటు రకరకాల పనులు చేపట్టేందుకు వేర్వేరుగా కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నది.
ఎకోపార్కులో 2.50 కి.మీ. బోర్డువాక్ పనులు పూర్తి కావచ్చాయని అధికారులు తెలిపారు. పక్షిశాల, బోర్డువాక్ మాత్రమే కాకుండా ఇంకా పలు రకాల నిర్మాణాలు ఉంటాయని, వీటిలో ప్రధానంగా రిసార్ట్, ఫుడ్ కోర్టు, అడ్వెంచర్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 85 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఎకో పార్కు స్థలంలో అక్కడక్కడ కొన్ని క్వారీలను సహజ సిద్ధంగా ఉంచి, అందులోని నీళ్లలో బోటింగ్ చేసేలా అందంగా తీర్చిద్దనున్నారు. ఎకో పార్కును సందర్శించే వారికి ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆటవిడుపు కోసం పలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.