హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): భారతదేశం బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకొని 75 సంవత్సరాలు కావొస్తున్న సువర్ణ ఘట్టమిది. ఈ శుభవేళ ఇంటింటా త్రివర్ణం రెపరెపలాడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి నేటి తరానికి తెలిసేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను చిరస్మరణీయమైన రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం తరఫున పదిహేను ఆగస్టు వేడుకలను పక్షం రోజుల పాటు అట్టహాసంగా జరపాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. వాడవాడలా, గడపగడపనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా, వకృ్తత్వ, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలను రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు.
ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల పండుగగా వజ్రోత్సవాలను జరుపుకొందామని శంఖం పూరించారు. నాటి వీరుల కీర్తి నేటి యువతకు స్ఫూర్తి అయ్యేలా ఘనంగా, వైభవోపేతంగా జాతీయ పతాకాన్ని రెపరెపలాడిద్దామని ఆకాంక్షించారు. చీకట్లను పారదోలిన తెలంగాణ జాతీయ దీపకళికలకు ప్రణమిల్లుదామని ఉద్ఘోషించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు& మొత్తంగా 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఉత్సవాల నిర్వహణపై శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘అటు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో, దేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి అర్థం కావాల్సి ఉన్నది. 75 ఏండ్ల కాలంలో స్వతంత్ర భారతం ఎన్నో ఘన విజయాలను సాధించింది. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారతదేశం పరిఢవిల్లుతున్నది. భారత స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారతదేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి ఉన్నది.
నాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకికవాద, సమాఖ్యవాద విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరునిమీద ఉన్నది. భారతదేశం భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో అత్యున్నత ప్రాపంచిక సార్వజనీన విలువలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచ దేశాల్లో భారతదేశానిది విలక్షణమైన సాంసృతిక జీవన విధానం. మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతికత పని వత్తిడి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటితరం ఆచరించిన దేశభక్తి కానీ అంతటి భావోద్వేగం కానీ నేటి యువతలో ప్రదర్శితమైతున్నట్టు లేదు.
ఇటువంటి వాతావరణాన్ని మనం పునఃసమీక్షించుకోవాల్సివున్నది. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అకెర దేశభక్తులైన తెలంగాణ బిడ్డలకున్నది. ఈ మేరకు పల్లె పట్నం ఒక్కటై, భారతావని ఘనకీర్తిని చాటాల్సి ఉన్నది’ అని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పారు.
వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిమీద జాతీయ పతాకం ఎగరాలని సీఎం అన్నారు. అందుకు అవసరమైన 1 కోటి 20 లక్షల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జెండాల కోసం గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద జాతీయ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేయాలని స్పష్టం చేశారు. జాతీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని జీఏడీ అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ వాహనం మీద జాతీయ జెండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా జెండాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకోసం అవసరమయ్యే జాతీయ పతాకాల ముద్రణ ఖర్చు సహా దేశభక్తి ప్రచార కార్యక్రమాల కోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా తగు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ నుంచి, దేశంలోని పలు ప్రాంతాలనుంచి, దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న నాటితరం జాతీయ నాయకుల వివరాలు విద్యార్థి, యువతకు అర్థమయ్యేలా
కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
రాష్ట్రంలోని పీజీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలు సహా గురుకులాలు, పభుత్వ ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు సహా అన్నిరకాల విద్యాసంస్థల్లో పంద్రాగస్టుకు ముందు వారం రోజులు, పంద్రాగస్టుకు తర్వాత వారం రోజులు మొత్తం 15 రోజుల పాటు నిర్వహించబోయే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అధికారులకు వివరించారు.
ఇందులో.. ఆటల పోటీలు, వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం పోటీలు, దేశభక్తిగీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర దేశభక్తిని ఉద్దీపన చేసే సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల్లో పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయా శాఖల ఉద్యోగులు, పదిహేను రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల రోజువారీ షెడ్యూల్స్ను రూపొందించుకుని, రెండు వారాల పాటు అమలు చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు వారివారి లెటర్హెడ్ల మీద జాతీయ జెండా బొమ్మను ముద్రించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
రాష్ట్రంలోని ప్రజా సంచార ప్రాంతాలు, బస్టాండ్లు, ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్మాల్స్, పట్టణాల్లోని స్టార్ హోటళ్లు సహా ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్పూర్తి జాలువారేలా జాతీయ జండా రెప రెపలాడేలా చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రజలు ఉద్యోగుల నడుమ సత్సంబంధాలు పెంపొందించేలా ఫ్రెండ్లీ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ఉద్యోగుల్లో కూడా దేశభక్తిని రగిలించే సాంసృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ‘ఫ్రీడం రన్’ లను నిర్వహించాలన్నారు.
పదిహేను రోజుల పాటు పత్రికల మాస్ట్హెడ్స్ మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించాలని, టీవీ చానల్స్లో 15 రోజుల పాటు జాతీయ పతాక చిహ్నాన్ని నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలని ఆయా మీడియా యాజమాన్యాలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ సప్తాహం’సందర్భంగా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సీఎం కోరారు.