పీసీసీ చీఫ్ రేవంత్ తెలంగాణ ద్రోహి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పరకాల, జూన్ 2 : కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే దేశ ప్రజలు నట్టేట మునిగినట్టేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని భారత దేశం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట నడువాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామ క్రాస్ వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.30.57 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జయశంకర్ సార్ స్వగ్రామం ఆత్మకూరు మండలం అక్కంపేటలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్ధాల పార్టీ, బీజేపీ ఝూటా పార్టీ అని.. తెలంగాణకు ఆ పార్టీలు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ కృషి ఎనలేనిదన్నారు. తెలంగాణకు జయశంకర్ సార్ గాంధీ అయితే సీఎం కేసీఆర్ నెహ్రూ అని అభివర్ణించారు. వాళ్లే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని, తెలంగాణ ప్రజల కష్టాలు తీరేవి కాదన్నారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. కానీ రాష్ట్రానికి ఏమి చేయని పార్టీలు సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల అక్కంపేటకు వచ్చి కేసీఆర్ను విమర్శించిన రేవంత్ తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో లేనోడు, జయశంకర్ సార్ అంటే తెలియనోడు ఇవ్వాల అక్కంపేటకు వచ్చి జయశంకర్ సార్ గురించి, అక్కంపేట గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఒక పక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే, రేవంత్రెడ్డి అమెరికాకు పారిపోయిన తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. ప్రాణాలు పోయిన కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలను రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.