హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘భారత్కు ప్రపంచ శక్తిగా ఎదిగే సామర్థ్యముంది.. అయితే ఐకమత్యంతోనే అది సాధ్యమవుతుంది’ అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శనివారం రామకృష్ణమఠంలో జరిగాయి. ఈ సందర్భంగా ‘చట్టం-సమాజం-పౌరుడు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయమూర్తుల ప్రవర్తనను ప్రపంచం గమనిస్తూ ఉంటుందని, బెంచ్పై ఉన్నా, బయట ఉన్నా ఆదర్శనీయంగా ఉండాలని చెప్పారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మధ్య (బార్ కు, బెంచ్కు మధ్య) ఆరోగ్యకరమైన సంబంధాలుంటేనే న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని అన్నారు.
ఆ రెండు న్యాయవ్యవస్థకు రెండు చక్రాల్లాంటివని పేర్కొన్నారు. వేష భాషలు, కులం, మతం, సిద్ధాంతాలు, ఆలోచనా తీరు వేరే అయినా రాజ్యాంగం సూచించినట్టు ప్రజలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజానికి అవకాశముంటుందని, అలాంటి సమాజంతోనే శక్తిమంతమైన దేశ నిర్మాణం సాధ్యమౌతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, న్యాయవాదులు, న్యాయ కళాశాలల విద్యార్థులు, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ, వాలంటీర్లు పాల్గొన్నారు.