కరీంనగర్ : దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణ పై కలెక్టరేట్లో వజ్రోత్సవాల కమిటీ నిర్వహించిన జిల్లాస్థాయి అధికారులతో మంత్రి గంగుల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఈ నెల 8 నుంచి 20వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యేవిధంగా అధికారులు చోరువ తీసుకోవాలని సూచించారు.
ఇందులో భాగంగా 9వ తేదీ నుంచే జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలని పేర్కొన్నారు.
వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని ఆగస్టు 8న ప్రారంభమవుతుందని ఉదయం 7.00 గంటలకు అంబేద్కర్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్ ఏనుగు రవీందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్ ,శ్యామ్ ప్రసాద్ లాల్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ , జమ్మికుంట కొత్తపళ్లి మున్సిపల్ చైర్మన్లు రాజేశ్వరరావు, రుద్రరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య,డీఆర్డీవో శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.