హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో పాఠాలు బోధించే అధ్యాపకుల్లో పీహెచ్డీ చేసినవారు 41 శాతం మందే ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు కనీసంగా ఎంటెక్తోపాటు నెట్/సెట్ అర్హత తప్పనిసరి. 2023 సంవత్సరం పూర్తయ్యేలోపు ఫ్యాకల్టీ అంతా పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి. ఇవి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమాకానికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విధించిన నిబంధనలు. కానీ, తాజాగా విడుదలైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) నివేదికలో దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 41.91 శాతం మాత్రమే పీహెచ్డీ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక 58 శాతానికి పైగా అధ్యాపకులు మాస్టర్స్ (పీజీ) అర్హతతోనే నెట్టుకొస్తున్నారు. దేశంలో మొత్తంగా 1,249 ఇంజినీరింగ్ కాలేజీలు, మరో 46 కేంద్రం ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిల్లోని ఇంజినీరింగ్ కోర్సులు బోధించేందుకు 1,53,227 అధ్యాపకులు/ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. వీరిలో సింహభాగం ఎంఈ, ఎంటెక్ పూర్తచేసినవారే. ఏటా ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ టీచర్ రేషియో పెరుగుతుండగా, రిసెర్చ్ పబ్లికేషన్స్లో ఐఐటీలు, డీమ్డ్ వర్సిటీలు మినహా మిగతా ఇంజినీరింగ్ కాలేజీలు వెనుకబడ్డాయి.
దేశవ్యాప్తంగా అన్ని కోర్సుల్లో ఫ్యాకల్టీ టీచర్ రేషియో క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో అధ్యాపక, విద్యార్థి నిష్పత్తి ఉత్తమంగా ఉన్నది. మొత్తంగా 1,181 ఇంజినీరింగ్ కాలేజీలకు గానూ 592 కాలేజీల్లో 21- 30 వరకు ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. 1-10 మందితో పనిచేసే ఇంజినీరింగ్ కాలేజీలు 2 ఉన్నట్టు ఎన్ఐఆర్ఎఫ్ పేర్కొన్నది.