హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా.. డిశ్చార్జీలు కూడా పెరుగుతుండటం కొంత ఊరటనిస్తున్నది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6,206 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 81.91 శాతానికి పెరుగగా, జాతీయ సగటు 81.7 శాతంగా నమోదైందని సోమవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 5,695 మందికి పాజిటివ్గా తేలింది. కరోనా, ఇతర కారణాలతో 49 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 80 వేలు దాటడం కాస్త ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో సోమవారంనాటికి 23,920 పడకలు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో 6,197 ప్రభుత్వ దవాఖానల్లో, 17,723 ప్రైవేట్ దవాఖానల్లో అందుబాటులో ఉన్నాయి. టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల వ్యాక్సినేషన్ జరుగలేదని అధికారులు తెలిపారు. ఆదివారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1352, రంగారెడ్డి 483, మేడ్చల్ మల్కాజిగిరి 427, వరంగల్ అర్బన్ 393, నిజామాబాద్ 258, సంగారెడ్డి 249, సిద్దిపేట 238, కరీంనగర్ 231, మహబూబ్నగర్లో 221 కేసులు వెలుగుచూశాయి.