మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు ( Maganur ) మండల కేంద్రంలో ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్( Petroll Bunk ) ను అధికారులు సోమవారం సందర్శించారు. బంకులో పెట్రోల్, డీజిల్ ఉన్న నో స్టాక్ బోర్డులు పెట్టి వాహనదారులకు ఇబ్బందులు గురి చేస్తున్నారని ‘ ఎన్టీ న్యూస్ ’ వెబ్ ( ntnews.com) లో వార్త కథనం ప్రచురితమైంది.
ఈ వార్తకు స్పందించిన తహసీల్దార్ సురేష్ సోమవారం ఉదయం సోమవారం మాగనూర్ శ్రీ లక్ష్మీనరసింహ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డును చూసి పెట్రోల్ ఉందా లేదా అని పెట్రోల్ బంక్ యజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతానికి పెట్రోల్ బంకులో ఎంత స్టాక్ ఉందని అడగగా డీజిల్ 10,000వేల లీటర్లు ఉందని, పెట్రోల్ 4 నుంచి 5 వేల లీటర్లు ఉండవచ్చని మేనేజర్ విశ్వనాథ్ వివరించారు. పెట్రోల్ బంక్ను ఎందుకు మూసి ఉంచారని అడగగా సిబ్బంది కొరత ఉన్నట్లు వెల్లడించారు. ఇష్టానుసారంగా పెట్రోల్ బంకులు నిర్వహించరాదని, పెట్రోల్ బంకులు 24 గంటలు పనిచేస్తూ ఉండాలని ఆదేశింఆచరు.
సిబ్బంది కొరతతో వచ్చిన వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ యజమాన్యం పూర్తిగా నో స్టాక్ బోర్డు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తహసీల్దార్ సురేష్, డీఎస్డీవో బాలరాజ్ మాట్లాడుతూ మంగళవారం మరోసారి పూర్తిగా తనిఖీ చేపట్టి పెట్రోల్ బంక్ పనిచేసేలా చర్యలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీశైలం, జీపీవో రాములు పెట్రోల్ బంక్ మేనేజర్ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.