ASK RCTS | సంగారెడ్డి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సైన్స్ అంటేనే.. ఊహకందని రహస్యాలను ఛేదించేందుకు నిత్యం పరిశోధించడం, మానవాళికి నిర్ధిష్టమైన సమాచారాన్ని అందించడం. ఈ క్రమంలో ఎన్నో సందేహాలు, అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని ఎప్పటికప్పు డు నివృత్తి చేసుకుంటూ.. సైన్స్ను అధ్యయ నం చేసేందుకు ఐఐఐటీ ‘ఆస్క్.. ఆర్సీటీఎస్’అనే ప్రత్యేక యాప్ను ఆవిష్కరించింది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరిగిన ఇన్వెంటివ్-24 మెగా టెక్నో ఫెయిర్లో ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీలు ప్రదర్శించిన మరిన్ని ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ-స్పిన్ నానో టెక్నాలజీ సంస్థ ఐఐటీ హైదరాబాద్తో సాంకేతిక బదిలీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నది.
ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఈ-స్పిన్ నానో టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సందీప్ పాటిల్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నానో ఫైబర్ను ఉపయోగించి మహిళల కోసం తేలికపాటి శానిటరీ ప్యాడ్ను ఐఐటీహెచ్ అభివృద్ధి చేసింది. నానో ఫైబర్ శానిటరీ ప్యాడ్ తయారీ సాంకేతికతను ఈ-స్పిన్ టెక్ సంస్థకు బదిలీ చేయనుంది. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. మెగా టెక్నో ఫెయిర్ చివరి రోజు ఈ-స్పిన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. శనివారం ముగిసిన మెగా టెక్నో ఫెయిర్లో పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వివిధ సాంకేతిక విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హాజరై ఆవిష్కరణలను తిలకించారు.
గూగుల్, చాట్ జీపీటీ లాంటి వేర్వేరు వెబ్సైట్ల ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఒక్క ఫోన్కాల్ ద్వారా 7, 8, 9 తరగతుల విద్యార్థులు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో తమ సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. ఇందుకు ఐఐఐటీ ప్రత్యేక యాప్ను తయారు చేసింది. ఆగస్త్య ఫౌండేషన్తో కలిసి ఆస్క్-ఆగస్త్య పేరిట ఆస్క్-ఆర్సీటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 1,900 పాఠశాలల విద్యార్థులు ఆస్క్-ఆర్సీటీఎస్ను వినియోగిస్తున్నారు. త్వరలోనే విద్యార్థులందరికీ ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐఐఐటీ ప్రతినిధులు ప్రభాకర్ ఎల్ల, రమేశ్ లోక తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని గోదాముల్లో ఆహార ధాన్యాలను నెలల తరబడి నిల్వ ఉంచడంతో పాడవుతాయి. ఇలాంటి పరిస్థితిలో బియ్యం, గోధుమలు, ఇతర ఆహారధాన్యాల నాణ్యతను గుర్తించడం గోదాముల్లోని సిబ్బందికి కష్టం అవుతుంది. ఆహార ధాన్యాలు పాడయ్యాయా? లేదా? తెలుసుకునేందుకు తంజావూరుకు చెందిన శస్త్ర యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మనివన్నన్ కృత్రిమ మేధను ఉపయోగించి ప్రత్యేక పరికరం(ఐవోటీ) తయారు చేశారు. ఇది బియ్యం, గోధుమల నుంచి వచ్చే వాసనను గుర్తించి.. ధాన్యం చెడిపోయింది.. లేనిది చెప్తుంది.
ఇంట్లో, డాబాపైన పెంచే కూరగాయలు, ఆకుకూరలు, ఇతర మొక్కలకు.. నీళ్లు, ఇతర పోషకాల అవసరాలను తెలుసుకునే సెన్సర్ యంత్రాన్ని ఐఐటీ బిలాయ్కు చెందిన అంకిత్ అవస్తి, రోషిని కౌషిక్, ఆస్తా రంగ్రూర్ రూపొందించారు. మొక్కలు ఉండే ప్రాంతంలో సెన్సర్ యంత్రాన్ని బిగించాలి. ఈ సెన్సర్ నిరంతరం మొక్కల ఎదుగుదలను పసిగడుతూనే.. వాటికి కావాల్సిన నీళ్లు ఇతర ఖనిజాలు ఎంత మేర అవసరమో అంచనా వేస్తుంది. ఆ వెంటనే ఐఐటీ బిలాయ్ పరిశోధకులు అభివృద్ధి చేసిన పామ్ వ్యూ యాప్ ద్వారా కూరగాయల పెంపకందారులకు ఫోన్లో సమాచారం అందజేస్తారు.
జమ్ముకశ్మీర్తోపాటు ఇతర శీతల ప్రదేశాల్లో దేశ రక్షణ విధుల్లో ఉండే సైనికులు చలి తీవ్రత కారణంగా నానా అవస్థలు పడతారు. వారి కష్టాలు తీరేలా ఐఐటీ బాంబేకు చెందిన శుభం బృందం.. సూర్యశక్తి పేరిట ఎన్సీఎఫ్ టెక్నాలజీతో హీటింగ్ పరికరాలను అభివృద్ధి చేసింది. నానో కార్బన్ ఫ్లూయిడ్స్ కోటింగ్ ద్వారా తయారు చేసిన హీటింగ్ పరికరాలు.. సూర్యరశ్మిని గ్రహించి చల్లనీటిని వెంటనే వేడి చేస్తాయి. సైనికులు ఉండే బంకర్లను క్షణాల్లో గరం చేస్తాయి. బంకర్లలో నిరంతరం వేడిగాలి ఉండేలా ఉష్మా పేరిట మరో యంత్రాన్ని ఐఐటీ బాంబే అభివృద్ధి చేసింది. ఇవి సైనిక బలగాలు చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతాయని, తాము అభివృద్ధి చేసిన ఎన్సీఎఫ్ హీటింగ్ పరికరాలు సోలార్ పద్ధ్దతిలో పనిచేయడంతో ఎలాంటి ఖర్చు ఉండదని పరిశోధకుడు శుభం తెలిపారు.