హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గణాంక నిపుణుడు దివంగత సీఆర్ రావు, ఇస్రో చైర్మన్ శ్రీధర ఫణికర్ సోమనాథ్కు ఇక్ఫాయ్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. హైదరాబాద్ నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో శనివారం ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ 13వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త సీ రంగరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ పట్టాలను సీఆర్ రావు సన్నిహితుడు యుగంధర్ అందుకోగా, సోమనాథ్ ఆన్లైన్లో అందుకున్నారు. ఈ సందర్భంగా 2,488 విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జగదీశ్కుమార్ మాట్లాడుతూ సవాళ్లను స్వీకరించాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పురోగతి సాధించాలని, ఎన్ని వైఫల్యాలొచ్చినా విజయ తీరాలకు చేరేదాకా ప్రయత్నాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఎల్ఎస్ గణేశ్, మాజీ వీసీ ప్రొఫెసర్ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.