కంది, జూలై 15: అద్భుతమైన ఖగోళ ప్రయోగాలతో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్.. అంతరిక్ష వాహక నౌకలతో తనకున్న గాఢమైన అనుబంధాన్ని, ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు. ఇంజినీర్గా, శాస్త్రవేత్తగా రాకెట్లను ఎంతో ప్రేమిస్తున్నానని, వాటిని పసిబిడ్డల్లా చూస్తున్నానని తెలిపారు. శుక్రవారం జరిగిన చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఎంతో ఆస్వాదించానని చెప్పారు.
శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డిగ్రీ పూర్తిచేసిన 980 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయడంతోపాటు సీఎస్సీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థి కార్తీక్ బాలాజీకి రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందజేశారు.
అనంతరం సోమనాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులు భావి భారత నిర్మాణంలో పాలుపంచుకోవాలని, ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగుతూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ పట్టాలను అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
వినూత్నమైన ఆవిష్కరణలకు తమ విద్యా సంస్థ నెలవుగా ఉన్నదని ఐఐటీహెచ్ గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ బీవీఆర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు ఏ పనినైనా ఉత్సాహం, బాధ్యతతో స్వీకరించాలని, దేశాన్ని తీర్చిదిద్దే శక్తి గ్రాడ్యుయేట్లకే ఉన్నదని తెలిపారు.
ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈసారి ఎంతోమంది విద్యార్థులు పట్టాలను అందుకోవడం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్నదని, విద్యార్థులతోపాటు అధ్యాపకులు, సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని, ఇంకా గొప్ప మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు.