హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్, బయోటెక్, మెడిటెక్ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన పురోగతిని సాధించిందని, అనతి కాలంలోనే ఎన్నో ఆవిష్కరణలతో ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించే స్థాయికి ఎదిగిందని లండన్కు చెందిన ఫార్మా కంపెనీ పీసీఎల్ ఎండీ డార్ల్ విలియమ్స్ అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బ్రిటన్ పర్యటన సందర్భంగా తెలంగాణలో తమ తొలి ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్టు గుర్తు చేశారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి పుష్కళమైన అవకాశాలు ఉన్నాయని, హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్గా నిలవనుందని డార్ల్ విలియమ్స్ నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ(పీసీఎల్)కి ఫార్మా, మెడిటెక్ రంగాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. చిన్న, మధ్య, స్టార్టప్ ఫార్మా, బయోటెక్ కంపెనీలకు ల్యాబ్ ఫెసిలిటీతోపాటు, పరిశోధన సేవలను అందిస్తూ గ్లోబల్ రిసెర్చ్ కమ్యూనిటీలో ఉనికిని చాటుతున్నాం. పౌడర్లు, ఘన పదార్థాల తయారీలో కీలకమైన అడ్వాన్స్డ్ సైంటిఫిక్ క్యారెక్టరైజేషన్ కోసం సులభమైన పద్ధతుల్లో సేవలను అందిస్తున్నాం. ఫార్మాస్యూటికల్, బయో ఫార్మా కంపెనీలకు అవసరమైన పరిశోధన సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాం. దీంతోపాటు సౌతిండియాలోనే తొలి అడ్వాన్స్డ్ ల్యాబ్ను తెలంగాణలో ప్రారంభించనున్నాం.
ఉప్పల్లోని ఐడీఏ పారిశ్రామికవాడలో దాదాపు ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి పీసీఎల్ ల్యాబ్ను వచ్చే నెలలో ప్రారంభిస్తాం. సౌతిండియాలోనే తొలి ల్యాబ్ ఇది. తెలంగాణలో వ్యాపార విస్తరణకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. తొలి దశలో రూ.16 కోట్లతో అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. వచ్చే మూడేండ్లలో అదనంగా రూ. 24.82 కోట్లు (3 మిలియన్ డాలర్లు)తో విస్తరింపజేస్తాం.
కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించడంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు వచ్చింది. ఫార్మా ఆర్ అండ్ డీలో జీనోమ్ వ్యాలీ సత్తా చాటుతున్నది. మెరుగైన మౌలిక వసతులతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. వచ్చే ఐదారేండ్లలో లైఫ్ సైన్సెస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారనున్నది. వ్యాపార విస్తరణకు ఉన్న విస్తృతమైన అవకాశాలను గుర్తించి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ బృం దం యూకేలో పర్యటించిన సమయంలో ఒప్పందం చేసుకున్నాం.