హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఐమాక్స్ తెరపై సినిమా చూస్తే కిక్కే వేరు. అత్యాధునిక హంగులు.. సూపర్ సౌండింగ్.. లగ్జరీ సీటింగ్తో భారీ తెరలపై సినిమా చూస్తే ఆ అనుభూతి చెప్పలేనిది. ఇలాంటి అనుభూతిని నగరవాసులకు గతంలోనే పరిచయం చేసిన ప్రసాద్స్ ఐమా క్స్.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకున్నది. ప్రపంచంలోనే అతి పొడవైన తెర.. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ను రూపొందించి ప్రేక్షకులకు సినీవిందును పంచనున్నది.
ఆ వివరాలను ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఐటీ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ మోహన్కుమార్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 630 సీటింగ్ కెపాసిటీతో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ 2 సినిమా ఈ స్క్రీన్పై ప్రేక్షకులకు కనులవిందు చేయనున్నదని చెప్పారు. దేశంలోనే అత్యంత ఖరీదైన 3డీ గ్లాసెస్ను వినియోగాన్ని ప్రారంభించను న్నట్టు వెల్లడించారు. ఓటీటీ ఎఫెక్ట్తో ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రాలను ప్రదర్శించడాన్ని మల్టీప్లెక్స్లు కొంతకాలంగా నిలిపివేశాయి. తాజాగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అవతార్ 2 సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నది.