హైదరాబాద్, డిసెంబర్ 11: విద్యుత్తుతో నడిచే వాహనాల తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్.. రాష్ట్రంలో యూనిట్ను నెలకొల్పడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. బీ2సీ, బీ2బీ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ నూతన ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ యూనిట్ను హైదరాబాద్ లేదా కోయంబత్తూరులో నెలకొల్పే అవకాశాలున్నాయని కంపెనీ ఎండీ, కో-ఫౌండర్ అన్మోల్ బోహ్రే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం సంస్థకు మధ్యప్రదేశ్లోని భోపాల్ వద్ద యూనిట్ ఉండగా, హైదరాబాద్లోని ఉప్పల్ వద్ద భాగస్వామ్య పద్ధతిన యూనిట్ను నెలకొల్పింది. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఏటా 60 వేల వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. వచ్చే ఏడాది 100 శాతం ప్రాంతీయంగా తయారైన విడిభాగాలతోనే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా లిథియం-అయాన్ బ్యాటరీ యూనిట్ ఇక్కడే ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నది.
2018లో దేశీయ ఈవీల మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థ అనతికాలంలోనే కొనుగోలుదారుల మన్ననలను పొందింది. 2025 నాటికి 3 లక్షల ఎలక్ట్రిక్ బైకులు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. దీనికి అనుగుణంగా పలు నూతన వాహనాలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్తోపాటు బెంగళూరు మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇక్కడ నూతన షోరూంలనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నది.