హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా రెండు ట్రాన్స్జెండర్ క్లినిక్లను హైదరాబాద్లో నెలకొల్పారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్, 2019 ప్రకారం.. ప్రతి మెట్రో సిటీలో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ఉండాలన్న నిబంధనకు లోబడి కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్లో ఈ రెండు క్లినిక్లను ప్రారంభించారు.
నగరంలోని ట్రాన్స్జెండర్లలో హెచ్ఐవీ ప్రాబల్యం ఉండటం, దాన్ని నిర్మూలించేందుకే హైదరాబాద్ను ప్రథమంగా ఎంపిక చేసుకున్నారని ట్రాన్స్ కార్యకర్త రచన ముద్రబోయిన తెలిపారు. హైదరాబాద్లోని ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీలో హెచ్ఐవీ ప్రాబల్యం 6.47 శాతం ఉండగా, జాతీయ సరాసరి 3.13 శాతంగా ఉంది. అయితే 2030 నాటికి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలన్న లక్ష్యంతో.. యూనైటెడ్ స్టేట్స్ ఏజెన్సీస్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ( USAID ), నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ( NACO ) పని చేస్తున్నాయి.
హైదరాబాద్లో ప్రారంభించబడ్డ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ క్లినిక్ సమర్థవంతంగా పని చేస్తున్నాయని రచన పేర్కొన్నారు. హెచ్ఐవీ నిర్మూలనకు మాత్రమే కాకుండా, ఆంటీరిట్రోవైరల్ థెరపీ ( ART ) చికిత్సలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. నగరంలో తొలి క్లినిక్ను నారాయణగూడలో ఈ ఏడాది జనవరి 29న, రెండో క్లినిక్ను జీడిమెట్లలో జులై 11న ప్రారంభించారు. అయితే ఈ క్లినిక్స్లో కేవలం ట్రాన్స్జెండర్లకు చికిత్స అందించడమే కాకుండా.. హిజ్రా, ట్రాన్స్ మెన్, క్రాస్ డ్రెస్సర్స్, లింగ నిర్ధారణ కాని వారికి, జోగినీలు, శివశక్తులకు కూడా వైద్యం అందిస్తున్నారు.
ఈ క్లినిక్లు పూర్తిగా ట్రాన్స్జెండర్లచే నడుస్తున్నాయి. దీని వల్ల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ట్రాన్స్ను నియమించామని పేర్కొన్నారు. డాక్టర్ ప్రాచీ, డాక్టర్ రుతు ఇద్దరూ ఎంబీబీఎస్ చదివారు. వీరిద్దరూ ట్రాన్స్జెండర్లే అని రచన ముద్రబోయిన తెలిపారు.