హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్స్టేషన్గా గుర్తింపు పొందిన పంజాగుట్ట పోలీస్స్టేషన్ నేడు అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యానికి అడ్డగా మారింది. దీనిని గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఠాణాలోని 85 మంది సిబ్బందిని మూకుమ్మడిగా కార్ (సిటీ ఆర్మ్డ్ రిజర్వు ) హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే వేర్వేరు పోలీస్టేషన్ల నుంచి వివిధ స్థాయిల సిబ్బంది 82 మందిని పంజాగుట్ట పీఎస్కు బదిలీ చేశారు.
పంజాగుట్ట ఠాణాలో మొత్తం 130 మంది సిబ్బంది ఉన్నారు, వీరిలో ఒకేసారి 85 మందిపై బదిలీ వేటు పడడం దేశంలోనే మొట్టమొదటి సారి అని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డిసెంబర్ 23న రాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రజాభవన్ వద్ద బారికేడ్లపైకి దూసుకెళ్లి ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ఘటనను కప్పిపుచ్చుతూ ఆ ప్రమాదానికి కారకుడు రహీల్కు బదులుగా అతని డ్రైవర్ కారకుడంటూ అప్పటి ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగానే రహీల్ను తప్పించి విదేశాలకు పారిపోవడానికి కారకుడయ్యాడని దర్యాప్తులో తేలడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో బోధన్ ఇన్స్పెక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట ఠాణాలో పనిచేస్తున్న సిబ్బంది విధి నిర్వాహణ, వారి వ్యవహారాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అంతర్గతంగా విచారణ జరిపారు. ఇందులో సిబ్బంది అవినీతి అక్రమాలు, నిర్లక్ష్యంపై సీపీకి నివేదిక అందించారు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒకేసారి భారీ ఎత్తున్న సిబ్బందిని కార్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టించింది.