హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): దళితుల సాధికారత కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పిన మొనగాడు సీఎం కేసీఆరేనని మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకొన్నారని ఆయన కొనియాడారు. దళితుల సాధికారతపై అఖిలపక్ష భేటీని నామమాత్రంగా కాకుండా, చిత్తశుద్ధితో సుదీర్ఘంగా నిర్వహించి..చర్చించారని, ఆ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం సమావేశం నిర్వహించలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించటమే కాకుండా ఎస్సీల అభివృద్ధి కోసం ప్రతి అంశంపైనా సమగ్రంగా చర్చించటం అసాధారణ విషయమని పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా దళితులు ఉన్నతిలోకి రావాలనే బలమైన ఆకాంక్ష ఉన్న సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ సమావేశానికి రావాలని స్వయంగా సీఎం ఫోన్చేసి ఆహ్వానించటం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు.
పేదరికంలో అట్టడుగున ఉన్న దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చి వారికి సాధికారత కల్పించాలనుకోవడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శమన్నారు. అంతేకాకుండా సామాజిక భద్రత విషయంలో రాజీపడబోమని, ఎక్కడైనా దళితులపై దాడులు జరిగితే, చట్టం వారికి రక్షణ కవచంగా ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రే భరోసా ఇవ్వటం అసాధారణ విషయమన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించటం వల్లే ఎంతోమంది దళితబిడ్డలు తమ జీవితానికి బంగారు బాటలు వేసుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళిత జాతి ఉన్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.