హయత్నగర్, నవంబర్ 4 : ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ ఇన్స్పెక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేటకు చెందిన రాజు (2002 బ్యాచ్) హైదరాబాద్ సౌత్జోన్ కంట్రోల్ రూమ్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
రాజు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని అతని భార్య కొన్నిరోజులుగా అనుమానిస్తున్నది. ఈ క్రమం లో గుర్రంగూడ సమీపంలోని చెట్ల పొదల్లో కారులో తన భర్త, వేరే మహిళతో కలిసి ఉన్నాడన్న సమాచారంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లింది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ కానిస్టేబుల్ రామకృష్ణ, హోంగార్డు నాగార్జున నాయుడు పిల్లల అరుపులు విని.. చెట్లపొదల్లోకి వెళ్లారు. వీరిని చూసిన ఇన్స్పెక్టర్ రాజు.. రామకృష్ణ, నాగార్జునపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు రాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.