హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం యజమానుల నుంచి భూములను సమూహంగా తీసుకొని మౌలిక వసుతులు కల్పిస్తూ వాటిని అభివృద్ధి చేయడంతో వాటి విలువ కొన్ని రెట్లు పెరిగిపోతున్నది. మాస్టర్ప్లాన్కు అనుగుణంగా రహదారుల నిర్మాణం, మంచినీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు సదుపాయం కల్పించడంలో ఆ భూముల విలువ మునుపటి కంటే భారీగా పెరిగిపోతున్నది. ఈ ప్రక్రియలో ఒకవైపు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వానికి భూసేకరణ భారం తగ్గడంతోపాటు పెరిగిన భూమి విలువలోనూ కొంత వాటా లభిస్తుంది. మరోవైపు గతంలో కంటే తమ భూముల విలువ 2-3 రెట్లు పెరుగుతుండటంతో భూ యజమానులు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ ప్రయోగం గుజరాత్, మహారాష్ట్రలో విజయవంతమైనట్టు రాష్ట్ర అధికారుల బృందం గుర్తించింది. భూయజమానుల నుంచి సేకరించిన భూమిలో తిరిగి 50 శాతం విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసి (ప్లాట్లుగా) వారికి అప్పగిస్తున్నారు. తమ భూముల పక్కన వచ్చిన మౌలిక వసతుల కారణంగా గతంలో కంటే కొన్నిరెట్లు ఎక్కువగా ఆ భూములకు విలువ పెరుగుతున్నది. అభివృద్ధి చేసిన భూముల్లోనే వ్యాపార, వాణిజ్య స్థలాలు కూడా యజమానులకు దక్కుతున్నాయి. అయితే అభివృద్ధి చేసిన స్థలాలను యజమానులు విక్రయించే క్రమంలో గతంలో కంటే పెరిగిన భూమి విలువలో ప్రభుత్వం 50 శాతం మేర వాటా తీసుకుంటున్నది.
తెలంగాణలో సమర్థంగా చేపట్టేందుకు…
భూసమీకరణ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017లోనే ఓ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హెచ్ఎండీఏ పరిధిలోని 4-5 గ్రామాల ప్రజలు ఒకే చోట 50 నుంచి 100, 300 ఎకరాల వరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కొనసాగుతున్నది. దీన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు, ఎక్కువమంది రైతులను ప్రోత్సహించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధ్యయనం చేసేందుకు రెండు బృందాలు మహారాష్ట్ర, గుజరాత్లో పర్యటించాయి.