తాండూర్/రామాయంపేట/జహీరాబాద్, జూన్ 23: మంచిర్యాల జిల్లా పోలీసులు బుధవారం రూ.14 లక్షల విలువ చేసే 7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు, రూ.2,50 లక్షల విలువ చేసే 500 లీటర్ల నిషేధిత గడ్డిమందును స్వాధీనం చేసుకొన్నారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేసి ఇద్దరిపై పీడీ యాక్టు నమోదు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2, మాదారంలో 1, భీమినిలో 3, కన్నెపల్లి పరిధిలో 4 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల, కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అక్కెపల్లి గోపాల్, ఇరుగాల రమేశ్, ఆకుల విఘ్నేశ్, ముత్తినేని మహేందర్, ఎం శేఖర్, బెల్క సంతోష్, వాడి సంతోష్, మద్దుకూరి రాంబాబు, రాచకొండ అశోక్, తాకిర సంతోష్, ఆకుల రాజేశ్ను అరెస్టుచేశారు. భరత్రెడ్డి (మహారాష్ట్ర), బీఆర్ కృష్ణారెడ్డి, ఏడుకొండలు (ఏపీ) పరారీలో ఉన్నారు. లోకండి భిక్షపతి, జాడి వెంకటేశ్పై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అనుమతిలేని ఆర్గానిక్ ఎరువులు పట్టివేత
ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయిస్తున్న ఆర్గానిక్ ఎరువులు, నకిలీ విత్తనాలను మెదక్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రామాయంపేట మండలం డీ ధర్మారం గ్రామానికి చెందిన పోగుల నాంపల్లి కొన్ని రోజులుగా తన ఇంట్లో ఆర్గానిక్ ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. విషయం తెలిసి దాడులు చేపట్టగా 640 కిలోల వరి విత్తనాలు, 32 కిలోల మక్కజొన్న విత్తనాలు, 140 కిలోల ఆర్గానిక్ ఎరువులు, గుళికలు లభించాయి. నిందితుడు పోగుల నాంపల్లిపై కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సుభాశ్గంజ్లో సరైన పత్రాలు లేకుండా విక్రయిస్తున్న 7క్వింటాళ్ల జనుము విత్తనాలను పట్టుకొన్నారు.