ఐనవోలు, జనవరి 16: శైవ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైన ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు మల్లన్న స్మరణతో మార్మోగిపోయాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. భోగి, సంక్రాంతి రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలివచ్చారు. ఒగ్గుపూజారులు పటాలు వేసి కల్యాణం జరిపారు. భక్తులు స్వామి వారికి ప్రీతికరమైన బోనం వండి నైవేద్యాలు సమర్పించారు. పలువురు మహిళలు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. మార్నేని వంశీయులు నిర్వహించే దేవుడి రథాన్ని డీసీసీబీ మార్నేని రవీందర్రావు ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మార్నేని వంశీయుల ఇండ్ల నుంచి మహా నివేదనను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. సంక్రాంతి నాడు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి దంపతులు, ఎర్రబెల్లి ట్రస్టు నిర్వాహకురాలు ఎర్రబెల్లి ఉషాదయాకర్ తదితర ప్రముఖలు స్వామి వారిని దర్శించుకొన్నారు.