హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉబెర్, స్విగ్గీ వంటి సంస్థలు అభివృద్ధి చెందటంలో అధునాతన జీపీఎస్, ఇంటర్నెట్ సౌకర్యాలే ముఖ్య భూమిక పోషించాయని స్విగ్గీ కో ఫౌండర్ నందన్రెడ్డి చెప్పారు. ఆంత్రప్రెన్యూర్షిప్లో డిజిటల్ ఇన్ఫ్రా ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకల్లో భాగంగా హెచ్పీఎస్ స్టార్ట్ ఎక్స్ ఆంత్రప్రెన్యూర్షిప్ సమిట్ను నిర్వహించారు.
యువ వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించటం కోసం ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా స్విగ్గీ కో ఫౌండర్ నందన్రెడ్డి, జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్రెడ్డి, ప్రోక్టర్ సీవోవో శైలేశ్ జేజూరికర్తోపాటు, నాసా చీఫ్ ఇంజనీర్ సతీశ్రెడ్డి, కేఎస్ ఆటోమోషన్ ఈడీ సుబ్రం కపూర్, ఎఫ్వీసీ ఎండీ కేఎస్ పరాగ్తోపాటు పలువురు టెక్ నిపుణులు, వ్యవస్థాపకులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్విగ్గీ కో ఫౌండర్ మాట్లాడుతూ.. కంపెనీలను స్థాపించడానికి మెరుగైన మౌలిక వసతులు అవసరమని అన్నారు. వినూత్న ఆలోచన విధానాలను అలవరుచుకోవాలని సూచించారు. ఇన్నేండ్లు ఫుడ్ డెలివరీపై దృష్టి సారించిన తాము ఇకపై లావాదేవీలను మరింత సులభతరం చేయడంపై దృష్టి సారించామని వివరించారు.
దేశంలో హెల్త్ కేర్, ఏఐ రంగాలకు పుష్కలమైన మానవ వనరుల అవసరం ఉన్నదని వెల్లడించారు. ఏఐ, చాట్ జీపీటీ ప్రస్తుతం ఎమర్జింగ్ టెక్నాలజీగా మారిపోయాయని కేఎస్ పరాగ్ అన్నారు. వెంచర్ క్యాపిటలిస్టుల సాయంతో పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టడం మరింత సులభమైందని హెచ్పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా అన్నారు.
శతాబ్ది వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పూర్వ విద్యార్థులు స్థాపించిన 30 స్టార్టప్లను ప్రదర్శించారు. వింటేజ్ కార్ల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నది. పూర్వవిద్యార్థులు, విద్యార్థులు కలిసి కార్నివాల్లో సందడి చేశారు. వేడుకల్లో భాగంగా అల్యుమ్నీతో విద్యార్థులకు ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సినీ ప్రముఖులు దగ్గుబాటి రానా, డైరెక్టర్ నాగ్అశ్విన్ తదితరులు పాల్గొననున్నారు. స్పోర్ట్స్ కార్ల ప్రదర్శన, సూపర్ కార్ షోను నిర్వహించనున్నారు.