Kalyana Lakshmi | ఆంధ్రప్రదేశ్ అనే గడుసైన పురుషుడితో అమాయకపు ఆడపిల్ల అయిన తెలంగాణను కలిపేటప్పుడు పెద్దలు సెలవిచ్చినట్టుగానే సంసారం సాఫీగా సాగలేదు. కుటుంబ పెద్దలైన పాలకుల ఉద్దేశపూరిత కుట్రల కారణంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైంది తెలంగాణ. ఎంతలా అంటే.. తినడానికే తిండిలేదు, ఆడపిల్లకెందుకు చదువు.. ఇంటి పట్టున ఉంటే పనులు చక్కబెడుతుంది…అని అనుకునేంత!
ఆడబిడ్డ గుండెల మీద కుంపటి అనే భావన కుటుంబ పెద్దల్లో సహజంగానే కలిగేలా చేసిన పాపం నాటి పాలకులదే! అంతటి అజ్ఞానంలో బతుకీడ్చిన తెలంగాణ కుటుంబాలు ఇప్పుడు తమకు మొత్తం ఆడ సంతానమే కలిగినా కించిత్ ధైర్యం కోల్పోవడంలేదు. ఆడపిల్లల అభీష్టం ప్రకారం ఎంత పెద్ద చదువైనా వద్దని అడ్డు చెప్పడంలేదు. సరైన ఈడు వచ్చేదాకా పెండ్లి ఊసే ఎత్తడంలేదు. ఇంతటి విప్లవాత్మకమైన మార్పు వెనుక దాగి ఉన్న కృషి సొంత రాష్ట్రంలో కొలువుదీరిన సర్కారుదేనంటే కాదనగలమా? కల్యాణలక్ష్మి రూపంలో అక్షరాలా లక్షానూట పదహార్లు చదివింపులు అందిస్తున్న కేసీఆర్.. తెలంగాణ కొత్త పెండ్లి కూతుర్లకు మేనమామ కాదని ఎవరైనా వాదిస్తే ఔననగలమా?!
పథకం అమలుతో బహుముఖ ప్రయోజనాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలు ఆడబిడ్డల కల్యాణం కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ తెలంగాణ సర్కారు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో అందిస్తున్న ఆర్థిక సహాయం ఎదుట దిగదిడుపే. ఇదే విషయాన్ని ఓ సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి/షాదీముబారక్. 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పథకం ప్రభుత్వ ఆశయాన్ని సాకారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ పథకం కింద తొలుత ఎస్సీ, ఎస్టీ యువతుల వివాహానికి రూ.51 వేలు అందజేయగా, తర్వాత బీసీలకు సైతం విస్తరింపజేశారు. మూడేండ్ల తర్వాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంచారు. 2018, మార్చి 19 నుంచి ఆ మొత్తాన్ని మరోసారి రూ.1,00116కు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఇక దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,145 అందజేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 11.56 వేల కోట్లకు పైగా నిధులను వెచ్చించి 13 లక్షల 15 వేల 297 మంది ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. పేదింటి తల్లిదండ్రుల్లో భరోసా నింపారు.
కల్యాణలక్ష్మి అద్భుతం
కల్యాణలక్ష్మి/షాదీముబారక్ అమలు తీరుపై పేదింటి తల్లిదండ్రుల అభిప్రాయాలు, పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న రూ.1,00,016 సాయాన్ని లబ్ధిదారులు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? యువతులకు కలుగుతున్న ప్రయోజనాలపై ఓ సంస్థ ఇటీవల సర్వేను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించింది. 90 శాతం మంది ఈ పథకం అద్భుతమని కొనియాడడం విశేషం. ప్రభుత్వ సాయంతో పెండ్లి ఖర్చుల భారం లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేశారు. లబ్ధిపొందిన వారిలో దాదాపు 72.5 శాతం మంది కేసీఆర్ కిట్టునూ అందుకోవడం మరో విశేషం.
అత్యధిక లబ్ధిదారులు బీసీలే…
కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో అత్యధికులు బీసీలే. పథకాన్ని ప్రారంభించిన మూడేండ్ల అనంతరం ఈబీసీలకు సైతం వర్తింపజేశారు.. అలా ఇప్పటి వరకు 6,35,451 మందికి మంజూరు చేసింది. మొత్తం 13.15 లక్షల లబ్ధిదారుల్లో బీసీలే 48.31 శాతం కావడం విశేషం. పథకం ద్వారా ఇప్పటి వరకు 13.15 లక్షల మందికి ఆర్థిక సహాయం మంజూరు చేయగా, వధువుతో కలిసి వరుడి కుటుంబాల పరంగా చూస్తే మొత్తంగా 26 లక్షల మంది లబ్ధి పొంది ఉండడం మరో విశేషం.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ప్రయోజనం..
☛ నిరుపేద తల్లిదండ్రులకు, మరీముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు పెండ్లి ఖర్చు భారం తగ్గిపోయింది.
☛ 18 ఏండ్ల నిబంధనతో బాల్యవివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి.
☛ అమ్మాయిలకు సరైన వయస్సులో వివాహం చేయడంతో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
☛ ఉన్నత విద్యను చదువుతున్న బాలికల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారి అభీష్టం మేరకు వివాహం చేసుకునే, నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది.
☛ కల్యాణలక్ష్మి చెక్కులను తల్లి పేరుమీద ఇస్తున్న ఫలితంగా మహిళల ఆర్థిక సాధికారత చేకూరుతున్నది.
☛ వివాహ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అతివలకు చట్టపరమైన భద్రత లభిస్తున్నది.
…?మ్యాకం రవికుమార్