వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : వరంగల్ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షలో భాగంగా నగరంలో 200 ఎకరాల్లో ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, డెంటల్ కాలేజీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు.. ప్రస్తుతం రూ.1,100 కోట్లతో 73 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానను నిర్మిస్తున్నది. ఆధునిక హంగులతో 25 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించి 35 వైద్య విభాగాలు ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలను అందించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది. ఈ దవాఖాన నిర్మాణ పనులు భారీ క్రేన్ల సాయంతో పగలు, రాత్రి తేడా లేకుండా వడివడిగా కొనసాగుతున్నాయి. ఈ పనులను సీఎం కేసీఆర్ ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా పరిశీలించారు.