హైదరాబాద్, ఫిబ్రవరి 26 : తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడం అద్భుత కార్యక్రమమని ప్రముఖ సామాజిక కార్యకర్త, హిమాలయన్ రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ ఇందిరా ఖురానా ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా మిగతా రాష్ర్టాలు కూడా ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా విన్నానని, ఆ ప్రాజెక్టును సందర్శిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కేంద్రీకృత జలవిధానాలు నష్టదాయకమని స్పష్టంచేశారు. ఆమె దాదాపు పాతికేండ్లుగా నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అవిశ్రాంతగా కృషి చేస్తున్నారు. నీటి సంరక్షణ, జీవవైవిధ్యం తదితర అంశాలపై పదుల సంఖ్యలో పుస్తకాలను రాశారు. బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ చేసిన ఆమె వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగాసెసె అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్తో కలిసి నదుల సంరక్షణకు పాటుపడుతున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరైన ఆమెను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
దేశంలోని ముఖ్యంగా హిమాలయ నదుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
ఈ మాట చెప్పడం చాలా బాధాకరంగా ఉన్నది. నదుల సంరక్షణపై ప్రభుత్వాలకు, ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత, మురుగు, మానవ వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల కారణంగా నదులు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. నిర్జీవంగా తయారవుతున్నాయి. కొన్నిచోట్ల చిన్న నదులు కనుమరుగవుతున్నాయి. ఈ దుష్ఫలితాలను మానవ సమాజమే భరించాల్సి వస్తుంది. గంగానది ఒక్కటే కాదు దేశంలోని అనేక నదుల పరిస్థితి ఇదే.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ విధానాలను పరిశీలించారా? ఎలా ఉన్నాయి?
తెలంగాణ పథకాల గురించి పత్రికల్లో చూస్తున్నాం. ఇక్కడి పరిచయస్తుల ద్వారా తెలుసుకొంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి చెరువులను పునరుద్ధరించడం అద్భుతం. అభినందనీయం. చెరువులనేవి వరదల నియంత్రణ, నదుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. రాజకీయాలను పక్కనబెట్ట్టి మిగతా రాష్ర్టాలు ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నీటి సంరక్షణే కాదు నిర్వహణ, వినియోగంపై ప్రజలందరికీ సంపూర్ణ అవగాహన ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకమే నిదర్శనం. అన్ని కోణాల నుంచి వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కృషిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా విన్నాం. సందర్శించాలని అనుకుంటున్నా.
నదుల అనుసంధానం ప్రాజెక్టు అవసరం ఎంత? చేపట్టాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉన్నదా?
నా మౌలిక ప్రశ్న ఏమిటంటే అసలు నదుల్లో నీళ్లు ఎక్కడున్నాయి? ఒకవైపు నదులన్నీ నిర్జీవమైపోతున్నాయి. మరోవైపు మిగులు జలాలు ఉన్నాయంటూ అనుసంధానం చేస్తామని కేంద్రం అంటుండటం ఆశ్చర్యంగా ఉన్నది. ఈ అంశం చాలా విస్తారమైనది. సామాజిక, ఆర్థిక కోణాలతో పాటు, పర్యావరణం, నీటిసంరక్షణ అంశాలపైనా విస్తృత్తంగా అధ్యయనం చేయాలి. అవేమీలేకుండా నదులను అనుసంధానిస్తామనడం దారుణం. అత్యంత ప్రమాదకరం.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జల విధానాలపై మీ అభిప్రాయం?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న జల విధానాలన్నీ కేంద్రీకృతమైనవే. నీటివనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు అవి పనిచేయవు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు చేపట్టడం లేదు. నీటివనరులను గుత్తాధిపత్యంలోకి తీసుకొస్తున్నది. ఇది నష్టదాయకం. ఇప్పటికైనా వికేంద్రీకరణ చేపట్టాలి. నదుల సంరక్షణకు సత్వర కార్యాచరణ రూపొందించాలి. లేదంటే భవిష్యత్తు తరాలకు నదులంటే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
గంగానది పక్షాళన ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి కారణం?
కేంద్ర ప్రభుత్వ కేంద్రీకృత విధానాలే ప్రధాన కారణం. ప్రజల భాగస్వామ్యం లేదు. అందుకే నిధులు ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గంగానదిలో మానవ వ్యర్థాలు కలువకుండా చూడాలన్న ఎన్జీటీ ఉత్తర్వులను అమలుచేయడం లేదు. నదీ పరివాహక ప్రాంతాలవారిని ఆ దిశగా చైతన్యవంతులను చేయలేదు. ఇప్పుడు అక్కడ మరొక మోడల్ను కేంద్రం అమలుచేస్తున్నది. గంగానదీ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో కాకుండా వాణిజ్య కోణంలో చేపడుతున్నది.